Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 1
#97
"నీ అంతిమ లక్ష్యం నేను కాదు సమరవిజయా. ఇన్నాళ్లూ నీ చేత నా నామ స్మరణ చేయించింది నీలోని యోధుడికి పెట్టిన పరీక్ష. నీలోని భక్తుడికి ఎలాంటి పరీక్షా లేదు. మీ అమ్మ గారి ద్వారా నీకు సంక్రమించిన ఆస్తి విష్ణు పథము. అసలైన పరీక్షలో నువ్వు ఇప్పుడు నెగ్గావు కాబట్టే నిన్ను వెతుక్కుంటూ భూలోకం నుండి నేను వచ్చాను.
 
కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల సైన్యాన్ని ఎదుర్కోవటం అంత సులభమైన పని కాదు. అందుకు నాకొక యోధుడు కావాలి. శివుణ్ణి నువ్వు కోరుకున్న మూడు కోరికల్లో మొదటిది నా దర్శనంతో ఈనాడు తీరిపోయింది. మిగిలిన రెండు కోరికలూ తీరే అవకాశం నీకిప్పుడు దొరికింది. నిన్ను కురుక్షేత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టమని ఆదేశించను. నా భక్తుడవు నీవు. నేను నిన్ను అర్థిస్తున్నాను. నీకు సమ్మతం అయితేనే రా. లేనిచో ఆనందంగా తిరిగి వచ్చిన దారినే నే వెళ్లెదను", అన్నాడు శ్రీ కృష్ణుడు.
 
"స్వామీ, మీరు సమరవిజయుణ్ణి అర్థించటం ఏంటి? మీ కోసం యుద్ధంలో నా ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడిన వాణ్ణి. నన్ను ఆజ్ఞాపించండి", అన్నాడు సమరవిజయుడు.
 
అలా కురుక్షేత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టాడు సమరవిజయుడు. శంభల నుండి భూలోకంలోకి వచ్చిన సమరవిజయుడు ఒక్క యోధుడిగా కాక 100 మంది యోధులలా రూపాంతరం చెందాడు. సమరవిజయునికి ఉన్న శక్తికి 1000 మందిని ఒకేసారి ఎదుర్కోగలడు.
 
సమరవిజయుణ్ణి ఒకే యోధుడిగా రంగంలోకి తెస్తే దుర్యోధనుడికి అనుమానం వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నది. అందుకే శ్రీ కృష్ణుడు తెలివిగా సమరవిజయుని నుండి 100 మంది వేర్వేరు యోధులను సృష్టించాడు. సమరవిజయుని యుద్ధశక్తిని 100 భాగాలుగా విభజించి 100 మందినీ సృజించాడు. 100 మందికీ వేర్వేరు ముఖాలు, వేర్వేరు యుద్ధ నైపుణ్యాలు ఉన్నా వారిలో ఉండే ఆత్మచైతన్యం ఒక్కటే. అదే  సమరవిజయ రామ.
 
కదనరంగంలో 100 మంది 1000 మందితో  సమానం.
అనగా ఒకే ఒక్కడైన సమరవిజయ రాముడే వెయ్యి మంది వున్న   సైన్యాన్ని చీల్చి  చెండాడగలడని  దానర్థం.
 
రోజు కురుక్షేత్రంలో సమరవిజయుడు చూపించిన తెగువకి ఎవ్వరికీ నోట మాట రాలేదు. 1000 మందిని మట్టి కరిపించటం అంటే మాటలా!
 
రోజున 1000 మంది కౌరవ సైన్యానికీ యుద్ధభూమిలో  వారి ఎదుటనున్న 100 మంది యోధులలోనూ సమరవిజయుడొక్కడే కనిపించటంతో  మాయకు గురయ్యారు. వాళ్లకేం తెలుసు ఒక్కడిలోనే 100 మంది ఉన్నారని.... వంద మంది ఒక్కడి నుంచే వచ్చారని.
 
శంభల నగరంలోని అతి పెద్ద రహస్యం ఇది. ఎవరికైనా చెప్పినా నమ్మశక్యం కాని వీరత్వం సమరవిజయ రాముడిది. అలాంటి యోధుడు మరొకడు పుట్టడు. ధీరత్వాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కళ్లారా చూసిన నేనే నా కళ్ళను నమ్మలేకపోయా. నేను అంతవరకు ఇలాంటి ధీరుని గురించి ఇలలో వినలేదు. కలలో కనలేదు. అందుకే సమరవిజయున్నే చూస్తూ ఉండిపోయా. రోజు సంగ్రామం పరిసమాప్తి అయినది. 1000 మందినీ మట్టికరిపించాడు. వారి సైన్యం అలా వారి కళ్ళముందే కుప్పకూలిపోవటం తట్టుకోలేక కౌరవులు యుద్ధభూమి నుండి నిష్క్రమించారు. 1000 మంది వున్న కౌరవుల సైన్యాన్ని హతమార్చిన తర్వాత 100 మంది యోధులు తమ ఉనికిని కోల్పోతూ వచ్చారు. యుద్ధభూమి యందు 100 మందికి బదులుగా ఇప్పుడు ఒక్కడే మిగిలాడు. అతనే ఇప్పుడు మీరిక్కడ ప్రతిమలో చూస్తున్న   సమరవిజయ రాముడు. మీరిక్కడ చూస్తున్నట్టే నాకు నాడు యుద్ధభూమిలో కనిపించాడు. తన ముఖం నిండా గాయాలతో, కత్తులు, బాణాలతో రక్తసిక్తమై కనిపించిన వీరాధి వీరుడు. నా హృదయం ద్రవించిపోయింది. ఆయన పాదాల మీద పడ్డాను. నీ లాంటి యోధుడిని  నేనెక్కడా  చూడలేదని చెప్పాను. ఉద్వేగానికి గురయ్యాను. అంతలో అక్కడికి శ్రీ కృష్ణుడు విచ్చేశాడు. శంభల నగరానికి సమరవిజయుణ్ణి తీసుకుని వెళ్లే అదృష్టాన్ని నాకిచ్చాడు. అక్కడి వారికి సమరుని వీరత్వాన్ని చాటి చెబుతూ 
సమరః ప్రాకారాన్ని నిర్మించే ప్రతిపాదనను శంభల రాజు ముందు పెట్టాను. అలా నాడు సమరవిజయుడు తన బాల్యం నుండి ఎదుగుతూ వచ్చిన చోటే 
సమరః ప్రాకారంగా మారిపోయింది. ఎంతో ఖ్యాతిని గడించింది", అంటూ చెప్పటం ముగించాడు మహిభార్గవుడు.
 
జీవితంలో అలాంటి యోధుడి గురించి ఎప్పుడూ వినని అభిజిత్, అంకిత, సంజయ్ లకు కళ్ళనిండా నీరు నిండిపోయింది. ఉద్వేగంతో. ఇంకేం మాట్లాడాలో తెలియని స్థితి అది.
 
ధైర్యానికీ, వీరత్వానికీ, యుద్ధనైపుణ్యానికీ పరాకాష్ఠ రోజు కురుక్షేత్ర మహాసంగ్రామంలో  సమరవిజయ రాముడు సృష్టించిన చరిత్ర. అలాంటి అరుదైన రహస్యాన్ని మహిభార్గవుడి ద్వారా తెలుసుకోవటం పూర్వజన్మ సుకృతమే అని వాళ్లకు అనిపించింది.
 
సిద్ధపురుషుడితో కాసేపు ముచ్చటించాడు మహిభార్గవుడు.
తర్వాత అక్కడినుండి సెలవు తీసుకున్నారు సిద్ధపురుషుడు, అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 
ప్రాంగణం బయటే ఉన్న సైనికుల దగ్గరికొచ్చి సిద్ధపురుషుడు ఇలా అడిగాడు.
 
"తరువాతి ప్రాకారం ఏది?"
 
" సూర్యః ప్రాకారం. అతి ముఖ్యమైనది ఇదే. శంభల నగరంలోని   సూర్యః ప్రాకారానికి సూర్యుణ్ణి అమితంగా ఆరాధించే దేవతలు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చి బ్రహ్మ ముహూర్తాన విచ్చేసి పూజలు నిర్వహించి వెళ్తూ ఉంటారు", అని చెప్పాడు వాళ్లలో ఒక సైనికుడు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 09-03-2024, 01:23 PM



Users browsing this thread: 1 Guest(s)