Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల నగరం – 10
మూడవ వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న ఆత్మస్తుతి అనే దోషము పూర్తిగా తొలగిపోతుంది. అన్నిటికీ నేనే కారణం. అంతా నా వల్లే జరుగుతోంది. అసలు నేను లేకపోతే ఇదంతా సాధ్యపడుతుందా? ఇలా ప్రతీ చిన్న విషయానికి ఆత్మస్తుతి చేసుకోవటం అలవాటైన వారికి వాకిలి ద్వారా వెళితే వారిలోని ఆత్మచైతన్య శక్తి జాగృతం అయ్యి అసలైన బ్రహ్మజ్ఞానం మీద జిజ్ఞాస పెరుగుతుంది. హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది", అన్నాడు ఆయన.
 
హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది
అన్న మాటలు ముముక్షువు చెబుతున్నట్టుగా వారికి అనిపించలేదు. మాటలు ఆయన నోటి వెంట వస్తున్నప్పుడు ముముక్షువునే చూసారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. ముముక్షువుకి బదులుగా సిద్ధపురుషుడు కనిపించాడు వారికి. ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు ముగ్గురూ.
 
"స్వామీ, చివర్లో మీరు బ్రహ్మ జ్ఞానం మీద జిజ్ఞాస పెరుగుతుంది అన్నారు కదా?" అడిగాడు సంజయ్.
 
"అవును", అన్నాడా ముముక్షువు.
 
"హరినామ సంకీర్తనతో మీ జన్మ సార్థకం అవుతుంది అని మీరు అనలేదా?" అడిగాడు అభిజిత్.
 
"అలా నేనలేదే", అన్నాడా ముముక్షువు.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయి చూస్తుంటే ముముక్షువు ఇలా చెప్పాడు.
 
"మీతో వచ్చిన సిద్ధపురుషుడిలో  ఋతంభర ప్రజ్ఞ వున్నది. నిరంతరమైన తపస్సు చేత, సాధన చేత ఆయనలో జాగృతం అయిన ప్రజ్ఞ అది. ప్రజ్ఞ ఆయన పొందటం వల్లే ఇంద్రియాలకు అతీతంగా చూడగలిగే ఒక దృష్టి ఆయన సొంతమయ్యింది. ఇప్పుడు ఆయన మీతో లేకపోయినప్పటికీ ఆయన శక్తి మీకు రక్షణ కవచంలా మీ చుట్టూ వున్నది. అందుకే మీకు వాక్యం వినిపించింది. ఇందులో అంతగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఆనందపడాల్సిన విషయమిది. అంతటి ప్రజ్ఞ కలిగిన సిద్ధపురుషుడు మీకు లభించటం మీరు చేసుకున్న పుణ్యఫలం. మీరెంతో అదృష్టవంతులు.
 
ఋషులు తపః శక్తితో సాధించిన శాశ్వత సత్యాల సమాహారమే వేదము. అలాంటి వేదాన్ని అర్థం చేసుకునే దృష్టి సిద్ధపురుషుని సొంతం. అలాంటి సిద్ధపురుషుడు మీకు గురువు అయ్యాడు. ఇంతకంటే మీకు కావలసినది ఏముంది?" అన్నాడు ముముక్షువు.
 
ముముక్షువుకు నమస్కరించి ఆయన నుండి సెలవు తీసుకున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు.
 
మందిరం నుండి బయటకి రాగానే అభిజిత్, అంకిత, సంజయ్ లు సిద్ధపురుషునికి అక్కడే పాదాభివందనం చేశారు. వారెందుకు అలా చేశారో సిద్ధపురుషునికి ఏం అర్థం కాలేదు.
 
"స్వామీ మందిరానికి వెళ్ళాక మాకు మీరేంటో అర్థం అయ్యింది", అని భావోద్వేగంతో చెప్పాడు అభిజిత్.
 
" మందిరాన్ని గుర్తు పెట్టుకోండి. మనం మళ్ళీ ఇక్కడికి రావలసి ఉంటుంది", అని చిరుమందహాసంతో అభిజిత్, అంకిత, సంజయ్ లను చూస్తూ సిద్ధపురుషుడు అన్నాడా మాట.
 
ఇద్దరు సైనికులూ వారికి దారి చూపిస్తూ ముందుకెళ్తున్నారు. వారు విమలః ప్రాకారంలోని హయగ్రీవుణ్ణి, షణ్ముఖుణ్ణి, వాగ్దేవతలను, జ్ఞాన సరస్వతీ దేవిని దర్శనం చేసుకున్నారు. తరువాతే జ్ఞాన కుంభములోని తీర్థాన్ని మూడు మార్లు స్వీకరించారు.
 
శంభల రాజ్యంలో తారా దేవి అన్న సరస్వతీ శక్తి రూపం ఉంటుంది. శత్రువులను మాటలతో సంహరించగల శక్తిని ఇస్తుంది. నీలమైన రంగులో ఉండే రూపం తారాదేవిది. తారా దేవి గురించి అభిజిత్, అంకిత, సంజయ్ లకు పరిచయం చేసాడు సిద్ధపురుషుడు. వారికి ఏదైతే తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదో అది మాత్రమే చెబుతూ ఉంటాడు. అడిగితే తప్ప ఒక్క వాక్యమైననూ ఎక్కువ చెప్పడు. వాక్కు మీద సిద్ధపురుషునికి ఎంత పట్టుందో చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
 
విమలః ప్రాకారంలోని జ్ఞాన దేవతలను దర్శించుకున్న తర్వాత, వారు  జ్ఞాన శిఖ గ్రంథాలయానికి వెళ్లారు. అక్కడున్న జ్ఞాన సంపదనంతా కళ్లారా చూసి ఆశ్చర్యపోయారు. అన్ని పుస్తకాలున్నాయి అక్కడ. జ్ఞాన శిఖ దాటిన తర్వాత జ్ఞాన దీపికలు అనబడే కేంద్రాలు 9 ఉన్నాయి. 9 జ్ఞాన దీపికలలో శాస్త్రవిద్యను క్షుణ్ణముగా అధ్యయనం చేసిన విద్యావేత్తలైన ముముక్షువులు ఉంటారు. వేదవిద్యను అభ్యసించిన ముముక్షువులు కూడా ఉంటారు. వాళ్ళందరూ సందేహ నివృత్తి చేస్తారక్కడ.

అలా విమలః ప్రాకారాన్ని మొత్తంగా సందర్శించాక వారు అక్కడి నుండి అభయః ప్రాకారానికి బయలుదేరారు.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 08-04-2024, 12:24 PM



Users browsing this thread: 1 Guest(s)